Daughters fight : అనాథలా తల్లి శవం.. ఆస్తి కోసం కుమార్తెల తగాదా..

Daughters fight
Daughters fight : మానవత్వం మంట కలిసిపోతోంది అనడానికి నిదర్శనం ఈ సంఘటన. అంతా డబ్బు.. మనిషి బతుకును అక్షరాల డబ్బే శాసిస్తుంది అని తెలిపేలా కోదాడ పట్టణంలో ఓ సంఘటన జరిగింది. కన్నతల్లి శవం కండ్ల ముందే ఉన్న కడుపున పుట్టిన ముగ్గురు బిడ్డలు తమకు రావలసిన ఆస్తి కోసం తగాదాపడటం పలువురిని ఆశ్చర్యాన్ని కలిగించింది.
సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని పాత పోస్టు ఆఫీసు వీధిలో నివాసముంటున్న వెల్దినేని నాగమణి (85) బుధవారం రాత్రి 11 గంటల ప్రాంతంలో మృతి చెందింది. తొమ్మిది నెలలు మోసిన తల్లిని కాటికి సాగనంపాల్సిన కూతుర్లు తమకు వాటాలు తేల్చాలంటూ గొడవకు దిగారు. ముగ్గురు కూతుర్ల మధ్య గొడవతో శవం రోడ్డుపైనే ఉంది. ముగ్గురికి తనకున్న ఆస్తిని మూడు వాటాలుగా చేసినప్పటికీ తనకున్న నాలుగో వాటాకు సంబంధించి కూతుర్లు గొడవ పడుతున్నట్లు సమాచారం.
తల్లి చనిపోకముందు 20 రోజుల నుంచి ఎవరు పట్టించుకోక పోవడంతో ఆ తల్లి రోడ్డుపైనే ఉండి, రోడ్డుపైనే తింటూ తనువు చాలించింది. చివరకు పెద్ద మనుషులు జోక్యం చేసుకొని ఎట్టకేలకు ముగ్గురు కూతుళ్లకు, అల్లుళ్లకు సర్ది చెప్పడంతో గురువారం సాయంత్రం మృతదేహానికి అంత్యక్రియలు చేశారు.