Jiyaguda : జియాగూడలో భారీ అగ్నిప్రమాదం.. బాలిక మృతి

Jiyaguda
Jiyaguda : హైదరాబాద్ పాతబస్తీలోని జియాగూడలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఓ బాలిక మృతిచెందగా మరో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మంగళవారం అర్ధరాత్రి తర్వాత జియాగూడ వెంకటేశ్వర నగర్ లోరి ఓ అపార్ట్ మెంట్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న ఫర్నీచర్ తయారీ ఫ్యాక్టరీలో మంటలు చెలరేగాయి. క్రమంగా అవి భవనం మొత్తానికి వ్యాపించాయి. స్థానికులు మంటలు ఆర్పేందుకు ప్రయత్నించినా లాభం లేకపోయింది.
సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది పది ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తెచ్చారు. అపార్టుమెంట్ మొదటి, రెండో అంతస్తుల్లో ఉన్న 20 మందిని రక్షించారు. వారిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని పోలీసులు ఉస్మానియా దవాఖానకు తరలించారు. అయితే, అక్కడ చికిత్స పొందుతూ బాలిక శివప్రియ (10) మృతి చెందింది. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు.