MLC Elections : పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభం

MLC Elections
MLC Elections : తెలంగాణలో వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నిక కొనసాగుతుంది. సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ప్రక్రియ జరగనుంది. ఈ ఎన్నికల బరిలో 52 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. పోలింగ్ ప్రశాంతంగా జరిగేందుకు ఈసీ ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది.
ఈ నెల 2న నోటిఫికేషన్ జారీ చేసిన ఎన్నికల కమిషన్, 9 వరకు నామినేషన్లు స్వీకరించింది. కాంగ్రెస్ నుంచి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ నుంచి ఏనుగుల రాకేశ్రెడ్డి, బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమేందర్రెడ్డి పోటీలో ఉన్నారు. వారి తరఫున ఆయా పార్టీలు సభలు, సమావేశాలు నిర్వహించాయి. తమకు మద్దతు ఇవ్వాలని వాయిస్ కాల్స్ ద్వారా ఆయా పార్టీల అధినేతలతో పాటు అభ్యర్థులు పట్టభద్రులను కోరారు.
ఈ నియోజకవర్గానికి 2021 మార్చిలో జరిగిన ఎన్నికలో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన జనగామ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందడంతో ఈ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది.