
helicopter crash
helicopter crash : ముంబయి నుంచి హైదరాబాద్ వస్తున్న ఓ హెలికాప్టర్ పుణె సమీపంలో కూలిపోయింది. అదృష్టవశాత్తు అందులో ఉన్న ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. పుణెలోని పౌద్ సమీపంలో ఓ ప్రైవేటు హెలికాప్టర్ కూలిపోయింది. ప్రమాదం సమయంలో నలుగురు ప్రయాణికులున్నారని పుణె రూరల్ ఎస్పీ పంకజ్ దేశ్ ముఖ్ తెలిపారు. అయితే వీరంతా ప్రాణాలతో బయటపడ్డారని ఆయన చెప్పారు.
వారిలో కెప్టెన్ తీవ్రంగా గాయపడగా ఆయనను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగతా ముగ్గురు సురక్షితంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. ప్రమాదానికి గురైన హెలికాప్టర్ గ్లోబల్ వెక్ట్రా కంపెనీకి చెందినదిగా తెలిపారు. ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. శనివారం ఉదయం నుంచి పుణెలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.