Air India : 24 గంటల పాటు విమానం ఆలస్యం.. స్పృహ తప్పిన ప్రయాణికులు

Air India Flight delayed
Air India : ఎయిరిండియాకు చెందిన ఓ విమానం 24 గంటల పాటు ఆలస్యమైంది. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. గంటల తరబడి అందులోనే కూర్వచోవడంతో కొందరు స్పృహ తప్పి పడిపోయారు. దేశ రాజధాని ఢిల్లీలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎయిరిండియాకు చెందిన ఏఐ 183 విమానం గురువారం మధ్యాహ్నం 3.20 గంటలకు ఢిల్లీ నుంచి అమెరికా శాన్ ఫ్రాన్సిస్కో బయల్దేరాలి. కానీ, సాంకేతిక సాంకేతిక సమస్యలు, నిర్వహణ కారణాలతో టేకాఫ్ ఆలస్యమైంది. దీంతో కొన్ని గంటల పాటు వారు విమానంలోనే కూర్చోవాల్సి వచ్చింది. ఏసీలు పనిచేయక పోవడంతో ప్రయాణికులు అవస్థలు పడ్డారు. ఊపిరాడక కొందరు అస్వస్థతకు గురైనట్లు తోటి ప్రయాణికులు సోషల్ మీడియాలో ఆందోళన వ్యక్తం చేశారు. దాదాపు 8 గంటల తర్వాత కొందరు స్పృహ కోల్పోవడంతో సిబ్బంది ప్రయాణికులందరినీ విమానం నుంచి దించేశారు. ఇది చాల అమానవీయమని ఆగ్రహించారు.
ఊహించని కారణాల వల్ల విమానం ఆలస్యమైందని, ప్రయాణికుల అసౌకర్యానికి చింతిస్తున్నామని తెలిపింది. సాధ్యమైనంత త్వరగా సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటలకు విమానం బయల్దేరనుందని తొలుత ఎయిరిండియా వర్గాలు వెల్లడించగా, కాసేపటికి విమానం రద్దయినట్లు ప్రకటించారు. అలా 24 గంటల ఆలస్యం తర్వాత ఈ మధ్యాహ్నం 3 గంటలకు ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు బయల్దేరనున్నారు.