TDP Central Office : టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసు.. మరో ముగ్గురి అరెస్టు

TDP Central Office
TDP Central Office : మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో పోలీసులు దూకుడు పెంచారు. ఇప్పటికే ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించిన విషయం తెలిసిందే. తాజాగా మరో ముగ్గురిని మంగళగిరి రూరల్ పోలీసులు అరెస్టు చేశారు. దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులు ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అనుచరులు జింకా సత్యం, లంకా అబ్బినాయుడు, తియ్యగూర గోపిరెడ్డిగా గుర్తించి అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య ఎనిమిదికి చేరింది.
2021 అక్టోబరు 19న టీడీపీ నేత పట్టాభిరామ్ అప్పటి ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు చేశారంటూ టీడీపీ కేంద్ర కార్యాలయంపై జగన్ మద్దతుదారులు దాడులు చేశారు. కార్యాలయం అద్దాలు పగులగొట్టి, కార్లు, ఫర్నిచర్ ధ్వంసం చేశారు. సిబ్బందిని కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా కొట్టారు. దీనిపై బాధితులు పోలీసులను ఆశ్రయించగా, వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండడంతో కేసును నీరుగార్చారని టీడీపీ నేతలు ఆరోపించారు. తాజాగా ఏపీలో ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఈ కేసు విషయంలో పోలీసులు దూకుడు పెంచారు.