Jagan passport : జగన్ కు పాస్ పోర్టుపై కోర్టులో వాదనలు.. పూచికత్తుతో ఎన్వోసీ పొందాలని ఆదేశం..

Jagan passport
Jagan passport : వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఐదేళ్ల పాస్ పోర్టు మంజూరైంది. విజయవాడలో ప్రజాప్రతినిధులకు సంబంధించిన కేసులకు గతంలో ప్రత్యేక కోర్టు అనుమతించిన ఏడాది పాస్ పోర్టు స్థానంలో జగన్ కు ఐదేళ్ల పాస్ పోర్టు మంజూరు చేయాలని రాష్ట్ర హైకోర్టు డివిజన్ బెంచ్ కొద్ది రోజుల క్రితం ఆదేశించింది.
అయితే తన పాస్ పోర్టు పునరుద్ధరణకు నిరభ్యంతర పత్రం (ఎన్వోసీ) జారీ చేసేందుకు ప్రత్యేక కోర్టు విధించిన షరతులను సవాలు చేస్తూ జగన్ దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు తోసిపుచ్చింది. సీబీఐ కోర్టు ఇప్పటికే ఐదేళ్ల పాటు ఎన్వోసీ ఇచ్చినందున ఏడాది పాటు ఎన్వోసీ ఇవ్వడం ప్రత్యేక కోర్టు పరిధికి అతీతమని జగన్ వాదించారు. ఐదేళ్ల పాటు పాస్ పోర్టును రెన్యువల్ చేయడం వల్ల ప్రాసిక్యూషన్ కు ఎలాంటి నష్టం లేదని ఆయన తరఫు సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి వాదించారు.
ప్రత్యేక కోర్టులో పరువునష్టం కేసు గురించి జగన్ కు తెలియదని, కోర్టు ఇంత వరకు దాన్ని పరిగణనలోకి తీసుకోలేదని, జగన్ కు సమన్లు జారీ చేయలేదని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున పబ్లిక్ ప్రాసిక్యూటర్ మెండా లక్ష్మీ నారాయణ వాదనలు వినిపిస్తూ జగన్మోహన్ రెడ్డికి పరువునష్టం కేసు గురించి తెలుసునని, ఆయన తన ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నారని తెలిపారు.
జగన్ కు సమన్లు జారీ చేశామని, అయితే ఆయన వాటిని స్వీకరించడానికి నిరాకరించారని, కోర్టుకు హాజరు కాకపోవడానికి సీఎంగా తన హోదా కారణమని ఆయన అన్నారు. ఐదేళ్ల పాస్ పోర్టు కావాలన్న జగన్ అభ్యర్థనను హైకోర్టు అంగీకరించగా, వ్యక్తిగతంగా స్థానిక కోర్టుకు హాజరై రూ. 20 వేల పూచికత్తు సమర్పించి, ఎన్వోసీ పొందాలని ఆదేశించింది. ట్రయల్ కోర్టు విధించిన ఇతర షరతులు యథాతధంగా కొనసాగుతాయని హైకోర్టు స్పష్టం చేసింది.